ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 82.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15 స్థానం సాధించింది. ఈ సారి కూడా బలికలే పై చేయి సాధించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా వున్నప్పుడు మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లా గత మూడేళ్ళుగా వెనుకబడి పోతుంది. ఈఏడాది జరిగిన పరీక్షల నేపథ్యంలో బుధవారం విడుదలైన ఫలితాల్లో మెరుగైన రిజల్ట్స్ సాధింఛామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు బాలురు 13 వేల 708, బాలికలు 13 వేల 660 మందితో మొత్తం 27 వేల 368 మంది హాజరయ్యారు. వారిలో బాలురు 10 వేల మంది 850 మంది, బాలికలు 11 వేల 658 మందితో మొత్తం 22 వేల 508 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 79.15 శాతం, బాలికల్లో 85.34 శాతంతో మొత్తం 82.24 శాతం ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా వున్నప్పుడు 2016-17లో 97.97 శాతం, 2017-18లో 97.61 శాతం, 2018-19 లో 98.19 శాతం, 2019-20లో నూరు శాతం, 2020-21 లో నూరు శాతం, 2021-22లో కేవలం 65.83 శాతం, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాలో 2022-23 లో 68.02 శాతం, 2023-24 లో 80.83 శాతం, ఇప్పుడు 2024-25లో 82.24 శాతం ఫలితాలు వచ్చాయి.ఫలితాలపై సంతృప్తిజిల్లాలో పదో తరగతి ఫలితాలు సంతృప్తినిచ్చాయని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదో తరగతి పాసైన విద్యార్థులకు, ఉపా ధ్యాయ బృందానికి కృ తజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాకినాడ జిల్లాకు 15వ స్థానం మాత్రమే దక్కడం కొంత బాధాకరమైన విషయం అన్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు దిగులు పడవద్దని వారికి మరో అవకాశం ఉందన్నారు. అందువల్ల పట్టుదలతో చదవాలని డీఈవో సూచించారు.మే 19 నుంచి సప్లిమెంటరీఅడ్వాన్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి 28 తేదీ వరకు వుంటాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కావాలని అనుకునే అభ్యర్థులు రీకౌంటింగ్, రీ-వేరిఫికేషన్ ఫలితాల కోసం వేచిచూడకుండా ఈ నెల 24 నుంచి వచ్చే నెల 1 లోపుగా ఆలస్య రుసుము లేకుండా, మే 1 నుంచి 18 వరకూ రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. త్వరలోనే మార్కుల మెమోలు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. నిర్ణీత సమయానికి ఆయా పాఠశాలలకు మార్కుల సర్టిఫికెట్లు పంపిస్తామని తెలిపారు. రీ కౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్కూ రూ.500, రీ వెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్ట్కూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
