ప్రజాశక్తి – సీతానగరం
మండలంలోని మునికూడలి గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఐదు వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించినా, దాని పక్కనే ఉన్న దళిత కుటుంబాలకు మాత్రం తాగు నీరు అందని ద్రాక్షగానే ఉంది. దీనికి ప్రధాన కారణం పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమేనని గ్రామస్తులు చెబుతున్నారు. పది నెలలుగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించినా, మునికూడలి సచివాలయ సిబ్బంది ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా, దీనిపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఎఇ, తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఒక నెలలో తాగునీటి కుళాయి ఇస్తామని, అందుకు కుళాయి కనెక్షన్కు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ఉచిత కుళాయి పథకం ద్వారా నీళ్లు ఇస్తుంటే, నిరుపేదలైన తాము డబ్బులు కట్టాలా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ధనికుల పశువుల పాకలు, ఖాళీ స్థలాల్లో జల జీవన్ మిషన్ ద్వారా ఉచితంగా కుళాయిలు వేసి, పేదల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. మునికూడలిలో తాగునీటి సమస్య తీవ్రతను బట్టి, అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
