అధికారులతో మంత్రి పి.నారాయణ సమీక్ష

Mar 8,2025 23:20
అధికారులతో మంత్రి పి.నారాయణ సమీక్ష

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ స్థానిక ఆర్‌ఎంసి కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ఆర్‌డిఒ ఆర్‌.కృష్ణ నాయక్‌, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మార్చి 12 నుంచి 15 వ తేదీ లోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఎంఎల్‌సి ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో టెండర్లను తెరిచి కాంట్రాక్ట్‌ సంస్థలను ఎంపిక ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని వాటికే చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గోదావరీ పుష్కరాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. సిటీ ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమీక్షించడం శుభ పరిణామం అన్నారు. 2027లో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధం చేస్తామన్నారు.

➡️