అధికారులకు కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్
పిడిఎస్ బియ్యం పంపిణీపై విజిలెన్స్ను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెసి ఎస్.చిన్నరాముడుతో రబీ ధాన్యం సేకరణ, సిఎంఆర్ లక్ష్యాలు, పిడిఎస్ బియ్యం పంపిణీ, కెర్నల్ వెరైటీ, రబీ సీజన్ ప్రారంభం నాటికి స్టాక్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో నిర్ధిష్టమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. పిడిఎస్ బియ్యం సరఫరా విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. సీజన్ ప్రారంభానికి ముందే పిడిఎస్ బియ్యం కోసం నిర్దేశించుకున్న ఫోర్టిఫైడ్ రైస్ నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిఎంఆర్ కింద 27,722 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటి వరకు 22,533 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయిందన్నారు. వాటికి సంబంధించి రసీదు నిర్ధారణ చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 5,191మెట్రిక్ టన్నులకు మిల్లుల నుంచి రసీదులు పొందాల్సి ఉందన్నారు.పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రజా పంపిణీ కోసం కేటాయించే వరిలో సూక్ష్మ పోషకాలను జోడించడం కోసం అవసరమైన ఫోర్టిఫైడ్ రైస్ ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మిల్లింగ్, ప్రాసెసింగ్ సమయంలో వరిలో కోల్పోయిన సూక్ష్మ పోషకాలను పునరుద్ధరించడానికి, ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను జోడించడం ద్వారా విటమిన్లు మరియు ఖనిజాల స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించిన బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ నిర్దేశించిన పాళ్లలో కలపాల్సి ఉంటుందన్నారు. సిఎంఆర్ మిల్లులు వద్ద ధాన్యం నిల్వలు, ధాన్యం ఆడడం ద్వారా ఉత్పత్తి అయిన బియ్యం, అంతకు ముందు మిల్లులు వద్ద ఉన్న స్టాక్ తనిఖీ చేసుకుని మాత్రమే నిర్ధారణ చేయాలన్నారు. పునర్ వినియోగ విధానంపై దృష్టి పెట్టడం తప్పని సరి అన్నారు. ఇందు కోసం అవసరమైన విజిలెన్స్ కార్యక్రమాలు సమాంతరంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. జిల్లాకు 1258.664 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయగా, జిల్లాలో 232 ఎమ్టిలు వినియోగించగా, 67 ఎమ్టిలు నెల్లూరుకు, ఇంకా 789 ఎమ్టిలు గోడౌన్ స్టాక్ రూపంలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా 181.58 ఎమ్టిలు నిలవ ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించిన బియ్యంలో ఫోర్టిఫైడ్ పోషక విలువలు పెంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటి విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం రవాణా వ్యవస్థ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షణా తప్పనిసరి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం.ప్రేమ్కుమార్, జిల్లా మేనేజర్ టి.రాధిక, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
