సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నోటీసులు అందజేత

May 7,2025 21:44
సమ్మె నోటీసు అందజేశారు.

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం రాజమహేంద్రవరం ఆర్‌టిసి డిపో మేనేజర్‌కు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్‌, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు మాట్లాడుతూ కార్మిక హక్కుల హరించే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్‌టిసిలో కాంట్రాక్టు కార్మికులు పెద్దఎత్తున దోపిడీకి గురవుతున్నారని, కనీస వేతనాలు పెంపుదల లేకుండా దీర్ఘ కాలంగా అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని తెలిపారు. ఆర్‌టిసి యాజమాన్యం ఇస్తున్నటువంటి కొద్దిపాటి వేతనాలు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారని తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని సర్కులర్‌ ప్రకారం జీతాలు కార్మికులకి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మే 20 జరిగే కార్మిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే కాంట్రాక్టు వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి బివిఎన్‌.పూర్ణిమరాజు ఆధ్వర్యంలో కార్మికులు రాజమండ్రి రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ ఎబిఎస్‌.రంగనాధన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్‌ కోడ్స్‌ను రద్దుచేయాలని, రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని, రైల్వే ప్రయివేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, రౖల్వే లో నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు కల్పించాలని, ఖాళీ అయిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తదితర డిమాండ్స్‌ సాధన కోసం ఈ నెల 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని నోటీసును అందజేశారు. .ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వంతం.రాంబాబు పాల్గొన్నారు.

➡️