జిల్లాలో పలు విద్యాసంస్థల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు. హరిదాసు, పగటి వేషగాళ్ల వేషదారణలో ఆకట్టుకున్నారు. రంగవల్లులు, భోగి మంటల నడుమ ఈ సంబరాలు జరిగాయి.
ఉండ్రాజవరం : మండలంలోని పలు పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ముందుగానే ఈ వేడుకలను నిర్వహించారు. వేలివెన్ను అన్నపూర్ణా, ఉండ్రాజవరం, మోర్త, చివటం, వెలగదుర్రు, తాడిపర్రు పాఠశాలలో విద్యార్థులు సంప్రదాయ వేషదారణల్లో ఈ పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో విద్యాసంస్థల్లో సంక్రాంతి వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమాల్లో తమ్మిశెట్టి రామసుబ్బారావు, ఎస్ఎంసి చైర్మన్ మైనం భవాని, హెచ్ఎం ఎస్ఎల్వి.ప్రసాదరావు, తాడిపర్రు అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాళ్లపూడి : పండుగల విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో అన్ని రకాల పండుగలను నిర్వహిస్తున్నామని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వ్యవస్థాపక కరస్పాండెంట్ వివి.అనీష్ తెలిపారు. పాఠశాలలో గురువారం అత్యంత ఉత్సాహవంతంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. కరస్పాండెంట్ దంపతులు భోగిమంట వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాల ఆవరణను రంగవల్లులతో ముంచెత్తారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గోకవరం : మండలంలోని కృష్ణునిపాలెం ఎంపియుపి స్కూల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. హరిదాసు తదితర సంప్ర దాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రత్నకుమారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ ఎ.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. రంప ఎర్రంపాలెంలో… ఆనందాన్ని,ఆహ్లదాన్ని పంచే పండుగ సంక్రాంతి అని ఎంపిడిఒ ఎం.గోవింద్ అన్నారు. గురువారం రంప ఎర్రంపాలెం సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ సాయిప్రసాద్, ఎంపిడిఒ గోవింద్, ఎస్ఐ పవన్కుమార్ హాజరయ్యారు. .ఈ సందర్భంగా వారు మాట్లాడు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జూదాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం రంప యర్రంపాలెంలో గతంలో వెలుగుచూసిన నకిలీ టీ పొడిపై కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో కూటమి నాయకులు, రెవెన్యూ ,సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నల్లజర్ల : దూబచర్లలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్బిఐ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.సతీష్కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నక్కంటి వెంకటేష్, అడ్వయిజర్ వీరభద్రరావు, ప్రిన్సిపల్ కెల్లా వంశీ, వైస్ ప్రిన్సిపల్ అంబటి సంఘమిత్ర, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.