ఆశాలకు కనీస వేతనాలేవీ..

May 9,2025 23:14
ఆశాలకు కనీస వేతనాలేవీ..

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిజాబ్‌ ఛార్ట్‌లో లేని పనులను సైతం చేస్తూ వైద్య ఆరోగ్య సేవల్లో కీలకపాత్ర వహిస్తున్న ఆశా వర్కర్లు అనేక ఏళ్లుగా సమస్యలతో సతమతం అవుతున్నారు. కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిరంతరం వీరి సేవలను వినియోగించుకుంటున్న సర్కారు సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏ ప్రభుత్వం మారినా కొత్త సీసాలో పాత నీరు మాదిరిగా సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపడం లేదు. గత సర్కారు కనీస వేతనాలను అమలు చేస్తామని, ప్రసూతి సెలవులు ఇవ్వడంతో పాటు వయోపరిమితిని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేకపోయింది. ఎన్నికల్లో లబ్ధి కోసం కూటమి పార్టీలు ఆశా వర్కర్లకు సైతం పలు హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలను అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సర్కారు నేడు నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన కోర్కెలను సాధించుకోవడం కోసం దశలవారీగా ఆందోళనకు సిద్ధపడుతున్నారు.కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 3,200 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. మాతా శిశ మరణాలను తగ్గించేందుకు కృషి, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సాహించడం ఇలా అనేక పనులు చేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతనాలు కరువయ్యాయి. దీంతో గతంలో జరిపిన అనేక పోరాటాల నేపథ్యంలో గత జగన్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. వర్కర్లకు మట్టి ఖర్చులుగా రూ.20 వేలు, వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచుతామని, 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తామని, పిఎం జెజెవై పథకంలో భాగంగా సర్వీసులో ఉండగా మరణిస్తే రూ.2 లక్షలు, ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందితే రూ.6 లక్షలు, పదవీ విరమణ బెనిఫిట్‌గా రూ.60 వేలు ఇస్తామని నమ్మబలికి చివరకు అధికారం కోల్పోయింది. ఇదే సమయంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశలకు గ్రాడ్యుటీ అమలు చేస్తామని, ప్రసూతి సెలవులు ఇస్తామని, వయో పరిమితి పెంచుతామని చెప్పుకొచ్చారు. వేతనాలు కూడా పెంచుతామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుంది. అయినా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంతో మరోసారి ఆశాలు ఆందోళన చేయగా ఈ ఏడాది మళ్లీ రెండు నెలల క్రితం మరోసారి హామీ ఇచ్చింది. వీటికి మినిట్స్‌ కూడా నమోదు చేశారు. కానీ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సర్కారు బోడి మల్లయ్య చందాన వ్యవహరిస్తున్నట్లుగా ఆశలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోసారి ఆందోళనకు సిద్ధంఒప్పంద హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశాలు మరోసారి ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఈ నెల 6న నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తూ విధులకు హాజరయ్యారు. తమ డిమాండ్లను అధికారులకు విన్నవిస్తున్నారు. వివిధ డిమాండ్ల సాధనకు ఈ నెల 20 జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. తమను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలనే తదితర డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులను అందజేశారు. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన తరుణంలో జూన్‌, జూలై నెలల్లో టోకెన్‌ సమ్మెలో భాగంగా రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, పిహెచ్‌సిలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద జరగనున్న సమ్మెలో పాల్గొంటారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టులో నిరవధిక సమ్మెలోకి వెళ్లే ఆలోచనలో ఆశాలు అడుగులు వేస్తున్నారు.

➡️