ప్రజాశక్తి-విజయనగరం : ఎన్సిసి క్యాడెట్ల లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎయిర్ కమోడోర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సిసి డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.ఎం. రెడ్డి సూచించారు. స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో జరుగుతున్న కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ పది రోజుల క్యాంపులో జరుగుతున్న డ్రిల్, ఆయుధ శిక్షణ, మ్యాప్ పఠనం, ప్రథమ చికిత్స, ట్రక్కింగ్, సమాజ సేవ వంటి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎన్సిసి క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం కృషి చేయడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. భారతదేశ సైన్యంలో చేరాలనుకునే యువతకు అవసరమైన అర్హతలు, శిక్షణ తదితర వాటిపై మార్గదర్శకం చేశారు. కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామ్మూర్తి, క్యాంప్ కమాండెంట్ తపస్ మండల్, డిప్యూటీ కమాండెంట్ పల్లవి వర్మ, సుబేదార్ మేజర్ అనిల్, అసోసియేట్ ఎన్సిసి అధికారులు శ్రీనివాసరావు, కెప్టెన్ సత్యవేణి, లెఫ్టినెంట్ కృష్ణ కిషోర్, లెఫ్టినెంట్ దినేష్, లెఫ్టినెంట్ లక్ష్మి, లెఫ్టినెంట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
