ప్రజాశక్తి – చింతలపూడి
అందరం కలిసి పని చేద్దామని, టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే కష్టపడే వ్యక్తులకు టిడిపితో పాటు నామినేట్ పదవులు సమానంగా నిర్వహిస్తామని మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, గంటా మురళీ రామకృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య అన్నారు. మండలంలోని ప్రగడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన టిడిపి, జనసేన ఉమ్మడి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇరు పార్టీ నాయకులు కార్యాచరణతో ఎలా ముందుకెళ్లాలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ ఏ కార్యక్రమం జరిగినా ఉమ్మడిగా అందరం కలిసి వెళ్తామన్నారు. దీనికి జనసేన నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి చింతలపూడి జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, కామవరపుకోట మండల అధ్యక్షులు ఎస్కె.వలి, జంగారెడ్డిగూడెం టౌన్ అధ్యక్షులు పీరు, ప్రగడవరం గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లూరి చిన్నబాబు, ఎక్స్ ఎంపిటిసి కనమత రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.