ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు 30 డెస్కులను బహూకరించిన తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుకా చౌదరి దంపతులను సోమవారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తాగిరి బాబు మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి కళాశాలకు రూ.2.7 లక్షల విలువైన ముఫై డ్యూయల్ డెస్కులను బహూకరించడం వారి ఔదార్యానికి నిదర్శనం అన్నారు. విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నారు. అనంతరం సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ కళాశాల మౌలిక వసతుల కల్పనలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం రేణుకాచౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్, ఉపాధి కల్పనలో సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి సెక్రెటరీ ఇరదల రఘుబాబు, అధ్యాపక బృందం కె.అజరు కుమార్ పాల్గొన్నారు.