మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ మార్గదర్శకాల వల్లేనన్నారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు, దెందులూరు ఎంఎల్ఎలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఆర్టిసి జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఎ అంబికా కృష్ణ, డిఎంహెచ్ఒ డాక్టర్ మాలిని, డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్కుమార్ పాల్గొన్నారు.
