ఉపాధి కూలీలకు వేతన బకాయిలివ్వాలి : వ్యకాస

ప్రజాశక్తి – టి.నరసాపురం

ఉపాధి కూలీలకు బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈనెల 20వ తేదీన పని బంద్‌ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుడెల్లి వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆసంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని అప్పలరాజు గూడెంలో ఉపాధి కూలీలలతో చర్చించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఈనెల 20న ఉపాధి కార్మికులు, ఉద్యోగ సంఘాలు, కార్మిక చట్టాలను పరిరక్షించాలని కోరుతూ జరిగే జాతీయ సమ్మెలో యావన్మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గత 13 వారాలుగా ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. రూ.కోట్ల నిధులు విడుదల చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఉపాధి కార్మికుల చేతికి డబ్బులు మాత్రం అందడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కనీస వేతనం రూ.600లు ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామలక్ష్మి పాల్గొన్నారు.

➡️