ఉత్సాహంగా, ఉల్లాసంగా టీ20 మ్యాచ్‌

పోలీసు, మీడియా మధ్య స్నేహపూర్వక క్రికెట్‌
ప్రెస్‌ జట్టుపై ఎస్‌పి జట్టు విజయం
మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధం : ఎస్‌పి ప్రతాప్‌శివ కిషోర్‌
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
పోలీసు, మీడియా మధ్య సన్నిహిత భావం పెంచేందుకు, క్రికెట్‌ క్రీడను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక క్రికెట్‌ ఆటను రెండు జట్ల మధ్య నిర్వహించామని ఎస్‌పి ప్రతాప్‌శివకిషోర్‌ తెలిపారు. మీడియాలో క్రీడాకారులు పోలీసుల క్రీడాకారులు ఆద్భుతంగా ఆడారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. పోలీసు, మీడియా మధ్య సన్నిహిత భావం పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెపొందించేందుకు ఆదివారం పోలీసు శాఖ మీడియా సంయుక్తంగా స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ను ఆశ్రమం క్రికెట్‌ క్రీడా మైదానంలో టీ20 మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. పోలీస్‌ జట్టు పేరు ఏలూరు ఎస్‌పి జట్టు కాగా మీడియా పేరు ఏలూరు ప్రెస్‌జట్టుగా పెట్టారు. ఎస్‌పి జట్టుకు ఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఏలూరు ప్రెస్‌ జట్టుకు సంజరు కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌ ఉదయం 10.20 గంటలకు మొదలైంది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్‌పి జట్టు 20 ఓవర్లలో 160 పరుగులకు ఒక్క వికెట్‌ కోల్పోయింది. కాగా ఏలూరు ఎస్‌పి జట్టులో జట్టు కెప్టెన్‌ ఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌ 50 బంతుల్లో 56 పరుగులు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు. ఎస్‌పి ప్రతాప్‌శివకిషోర్‌ ఆట తీరు పోలీసు జట్టులో మిగిలిన ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చింది. ఆదిప్రసాద్‌ 32 బంతుల్లో 50 పరుగులు చేశారు. ఎఆర్‌ ఆర్‌ఐ పవన్‌కుమార్‌ 30 బంతుల్లో 35 రన్స్‌ సాధించారు. ఏలూరు ఎస్‌పి జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ఎస్‌పి జట్టు కెప్టెన్‌ ప్రతాప్‌ శివ కిషోర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేశారు. ఆయన నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లను తీశారు. ఎస్‌ఐ మదీనా భాషా రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ను తీశారు. 20 ఓవర్లలో 160 పరుగులకు ఎస్‌పి జట్టు ఒక వికెట్‌ను కోల్పోయింది. ఏలూరు ప్రెస్‌ జట్టుకు 161 పరుగుల టార్గెట్‌ను ఎస్‌పి జట్టు ఇచ్చింది. ఏలూరు ప్రెస్‌ జట్టు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగిన కృష్ణంరాజు (ఆర్‌ఆర్‌.పేటరాజు) బాబి (బాబీష్‌) మైదానంలో గట్టి పోటీని ఎస్‌పి జట్టుకు ఇచ్చారు. వీరి ఆట పేరు మిగిలిన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపింది. ఏలూరు ప్రెస్‌ జట్టు ఆటగాళ్లు వీరోచితంగా పోరాడారు. అయినప్పటికీ ఎస్‌పి బౌలింగ్‌ ధాటికి ఏలూరు ప్రెస్‌ జట్టు నాలుగు వికెట్లను కోల్పోయింది. ఎస్‌ఐ మదీనా భాషా బౌలింగ్‌లో రెండు వికెట్లను కోల్పోయింది. చివరకు ఏలూరు ప్రెస్‌ జట్టు 20 ఓవర్లలో 97 పరుగులు చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. 63 పరుగుల తేడాతో ఏలూరు ఎస్‌పి జట్టు విజయాన్ని సాధించింది. 56 పరుగులు చేసి, నాలుగు వికెట్లు తీసిన ఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌కు మ్యాన్‌ అఫ్‌ ది సిరీస్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు రెండు వరించాయి. మ్యాచ్‌ అనంతరం రెండు జట్లు కరచాలనం చేసుకుని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ మ్యాచ్‌కు మెయిన్‌ ఎంపైర్‌గా రవీంద్ర వ్యవహరించగా లెగ్‌ ఎంపైర్‌గా సాగర్‌ వ్యవహరించారు. చాలాకాలం తర్వాత స్నేహపూర్వకమైన క్రికెట్‌ ఆట పోలీసు, ప్రెస్‌ ుధ్య జరగడంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని మ్యాచ్‌లను ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌పి తెలిపారు. మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన చిన్నారులకు మిఠాయిలు పంచారు.

➡️