‘పది’లో బాలికలదే పైచేయి.!

77.24 శాతం ఉత్తీర్ణతతో జిల్లాకు 21వ స్థానం
గతేడాదికన్నా మూడు శాతం తగ్గిన ఉత్తీర్ణత
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మరోసారి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రంలో ఏలూరు జిల్లా 21వ స్థానం సాధించింది. 77.24 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. 2021-22లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 57.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2022-23లో ఏలూరు జిల్లా 64.35 శాతం, 2023-24లో ఏలూరు జిల్లా 80.08 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ సంవత్సరం మూడుశాతం ఉత్తీర్ణత తగ్గిపోయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 22,365 మంది పరీక్షకు హాజరవ్వగా 77.24 శాతంతో 17,274 మంది ఉత్తీర్ణత సాధించారు. దీనిలో 72.94 శాతంతో 8,146 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, 81.52 శాతంతో 9,128 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ తేదీ నుండి మే ఒకటో తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డిఇఒ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఫీజు చెల్లించాలని, రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చొప్పున, రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని తెలిపారు. సిఎఫ్‌ఎంఎస్‌ సిటిజన్‌ చలానా ద్వారా చేసిన చెల్లింపులు ఆమోదించబడవని, తిరిగి చెల్లించబడవని, సర్దుబాటు చేయబడవని తెలిపారు. అలాగే మే 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని, ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించవచ్చని, రూ.50 అపరాధ రుసుంతో మే ఒకటో తేదీ నుంచి పరీక్ష తేదీ ముందు రోజు వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఇక జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో ఏలూరు ఆక్సఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థిని బి.గగనశ్రీ 597 మార్కులతో మొదటి స్థానంలోనూ, నూజివీడులోని కుమార్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థిని కె.డింపుల్‌ 596 మార్కులతో రెండో స్థానంలోనూ, జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్‌ పాఠశాల విద్యార్థి కె.రుష్మిత లక్ష్మీసాయి 596 మార్కులతో మూడో స్థానంలోనూ నిలిచారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్స్‌ వివరాలు చూస్తే ఆగిరిపల్లి మండలం ఎం.సూరవరం జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థి జి.జనార్దన్‌బాబు 588 మార్కులతో మొదటి స్థానంలోనూ, మండవల్లి మండలం లింగాల జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థి బి.ధీరజ్‌సాయి విశాల్‌ 587 మార్కులతో రెండో స్థానంలోనూ, కలిదిండి జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థి నాయుడు హర్షవర్ధిని 586 మార్కులతో మూడో స్థానంలోనూ, కామవరపుకోట జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థి సిహెచ్‌.సూరదీప్తి 586 మార్కులతో నాలుగో స్థానంలోనూ నిలిచారు.

➡️