రేషన్ బియ్యం కోసం కొండరెడ్డి గిరిజనుల అవస్థలు
రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులు అవ్వక ఇబ్బందులు
సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపు
నేడు బుట్టాయగూడెంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
ప్రజాశక్తి – బుట్టాయగూడెం
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వంలోని జనసేన తరపున రెండో స్థానం వ్యక్తిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యధిక శాతం పేద, నిరుపేదలు ఉండే పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి నిరాశ్రయులుగా మిగిలి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్న నిర్వాసిత కుటుంబాలు పోలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. కోయ గిరిజనులు, కొండ రెడ్డి గ్రామాల ప్రజలు ఈ ప్రాంతంలోనే అధికంగా నివసిస్తున్నారు. కొండరెడ్డి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. పౌర సరపరాల శాఖ ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకోవడానికి కొండ రెడ్డి గిరిజనులు ఐదు నుంచి పది కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో కొండరెడ్డి గిరిజన ప్రజలు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య రేషన్ కార్డు ఎడిటింగ్, డిలేటింగ్, యాడింగ్. కొత్తగా పెళ్లి అయిన వారు, పుట్టిన పిల్లలు, చనిపోయిన వారి పేర్ల చేర్పులు మార్పులు చేయడం కోసం ప్రజలు నిత్యం సివిల్ సప్లై అధికారుల చుట్టూ, సచివాలయల చుట్టూ, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. అధికారులు సర్వర్ పనిచేయడం లేదని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ సర్వర్ సమస్యలు పరిష్కరించడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో గిరిజన, కొండరెడ్డి ప్రజల సమస్యలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారమవుతాయని వారు ఎదురుచూస్తున్నారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలితెల్లం రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులుమారుమూల కొండరెడ్డి గ్రామాల్లో నివసిస్తున్న కొండరెడ్డి, గిరిజనులు రేషన్ బియ్యం తీసుకునేందుకు పడుతున్న కష్టం వర్ణనాతీతం. అంతే కాకుండా బియ్యంతో పాటు పప్పు, నూనె సరఫరా చేయడంలేదు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. ఆధునిక ప్రపంచంలో ఇంకా గిరిజన, కొండరెడ్డి ప్రజలు రేషన్ బియ్యానికి, విద్యకు, వైద్యానికి అందనంతా దూరంలోనే ఉన్నారు.
