ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
ప్రజాశక్తి – బుట్టాయగూడెం
కన్నాపురం రేంజర్ సబ్ డిఎఫ్ఒను వెంటనే సస్పెండ్ చేసి ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. గుల్లపూడి గ్రామ పెద్దల సమావేశం మడకం వెంకమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షులు కురం సత్యనారాయణ దొర మాట్లాడుతూ మడకం యాకోబుపై దాడి చేసి ఐదు రోజులవుతున్నా కన్నాపురం రేంజర్ సబ్ డిఎఫ్ఒపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. ఎస్సి ఎస్టి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ తాత్సారం చేస్తున్నారన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం యాకోబుకు మెరుగైన వైద్యం చేయించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఆదివాసీ పాస్టర్ అసోసియేషన్ నాయకులు పీలీప్ పూనెం శేఖర్, తెల్లం ఇశ్రాయేలు, గిరిజన సంఘం నాయకులు పోలోజు నాగేశ్వరరావు, మడకపాటి అనూష, పూనెం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
