పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అవగాహన తప్పనిసరి

శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి – ఏలూరు
ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకూ తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియపై అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏవిధమైన అవగాహన ఉందో తెలుసుకునేందుకు కలెక్టర్‌ పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తూ ఫారం-13సి, ఫారం-13ఎ, ఫారం-13బిలకు సంబంధించిన అంశాలను వివరించారు. వాటిపై సంపూర్ణ అవగాహన తప్పనిసరన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సొంత ఆలోచనలకూ తావీయకుండా ఎన్నికల నిబంధనలను విధిగా పాటించి ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ డి.పుష్పమణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.బాబ్జి, ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, సర్వశిక్షా అభియాన్‌ ఎపిసి బి.సోమశేఖర్‌, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️