అభివృద్ధి అంటే..!

ఎన్నికల ముందు ప్రచారంలో ప్రతిపక్ష, అధికారపక్షాలు ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాయి. ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా నేతల నోట పదేపదే విన్పించే మాట ఇదే. అయితే తాము చేసిన పనులే అభివృద్ధి పనులుగా పాలకులు చెప్పుకుంటే.. ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటి సంగతేమిటని నిలదీయడం ప్రతిపక్షాల వంతు. ‘పది మంది దోషులు బయటున్నా పర్వాలేదుగాని.. ఒక నిర్దోషి నిర్బంధంలో ఉండకూడదు’ అనేది సహజ న్యాయ సూత్రం. అలాగే అభివృద్ధి అనేది ఏఒక్క పేదవానికీ నష్టం కల్గించకుండా ఉండాలనేది జనం, జనం పక్షాన నిలిచేవారి ఆకాంక్ష. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అభివృద్ధి అనే అంశంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఇది ఉండి నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉందనేది అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కాల్వల అభివృద్ధికి విరాళాల సేకరణ చేపట్టిన ఘనత ఉండి ఎంఎల్‌ఎ కనుమూరి రఘురామకృష్ణరాజుకే దక్కింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు ఎంఎల్‌ఎ తన భుజస్కంధాలపై వేసుకుని విరాళాలు సేకరించి పనులు చేపడుతున్నారని అంతా భావించారు. తర్వాత నియోజకవర్గ పరిధిలోని పోలీసు స్టేషన్లు అన్నింటికీ వాహనాలు సమకూర్చడం, సీసీ కెమెరాలు సమకూర్చడం వంటివన్నీ దాతల ద్వారా ఎంఎల్‌ఎ చేపట్టారు. వీటిలో ఎక్కడా పేద, మధ్యతరగతి ప్రజలకు దాతల నుంచి సేకరించిన సాయం అందించింది లేదు. అంటే చంద్రబాబు చెబుతున్న పి4 ప్రకారం పెద్దల ద్వారా పేదల అభివృద్ధి పక్కనబెట్టి, పెద్దల నుంచి ప్రభుత్వ శాఖలకు కనీస వసతుల కల్పనపైనే సాగడం అనేది ఉండి నియోజకవర్గ పి4 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివశిస్తున్న పేదల ఇళ్లను కాలుష్య నివారణ, కాల్వల అభివృద్ధి పేరిట వందల సంఖ్యలో ఉండి నియోజకవర్గంలో తొలగించారు. ఆకివీడు, కాళ్ల, ఉండి, పాలకోడేరు ఇలా అన్ని మండలాల్లోనూ ఇది సాగింది. దీనిపై ఆయా సందర్భాల్లో పెద్దఎత్తున పేదలు ఆందోళన చేశారు. దీనిలో భాగంగానే పాలకోడేరు ఎఎస్‌ఆర్‌ నగర్‌లో సుమారు 35 ఏళ్ల నుంచి నివాసముంటున్న వారిని గత శనివారం ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా పేదలు పెద్దఎత్తున ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసుల దాడిలో పలువురు గాయాల పాలయ్యారు. దీంతో వెనక్కితగ్గిన యంత్రాంగం, మరుసటి రోజు తెల్లవారుజామునే ముందుగానే నేతలను గృహనిర్బంధం చేసి ఆ ప్రాంతంలో పెద్దసంఖ్యలో పోలీసులను మొహరించి నిర్థాక్షిణ్యంగా ఇళ్లను కూల్చేశారు. దీనిపై బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు సిపిఎం రాష్ట్ర బృందం అక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల ఇళ్లు కూల్చడం అభివృద్ధి కాదని, నెల రోజుల్లో అక్కడే బాధిత పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. పేదలకు న్యాయం చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్‌. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ హోదాలో ఉన్న ఉండి ఎంఎల్‌ఎ రఘురామకృష్ణరాజు స్పందించిన తీరు రాజకీయ నేతలను, ప్రజలను నిర్ఘాంత పర్చింది. ప్రధానంగా వాడిన భాష, తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. పోనీ ఆయన భాష, తీరు సంగతి పక్కన పెడితే సిపిఎం నేతల ప్రధాన డిమాండ్‌ పేదలకు న్యాయం చేయాలనేది. దానిపై ఎక్కడా నేరుగా ఎంఎల్‌ఎ స్పందించిన పరిస్థితి లేదు. ప్రధానంగా ఎక్కడైతే ఇళ్లు కూల్చారో వారందరికీ ఇళ్లు అక్కడే నిర్మిస్తామనో, లేక వేరేచోట స్థలాలు కేటాయించి నిర్మిస్తామని చెబితే అర్థం ఉంది. పేదల నివాస ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న బోదె దిగువ ప్రాంతం వారు కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నందు వల్లే ఈ చర్యలని రఘురామకృష్ణరాజు చెప్పారు. కచ్ఛితంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాల్సిందే. అసలు కాలుష్యం సమస్యపై జిల్లాలో పోరు సాగించింది ఎవరంటే సిపిఎం అనేది అందరికీ తెలుసు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ భీమవరంలో సమావేశం నిర్వహించి సుమారు 19 పరిశ్రమల వల్ల డెల్టాలో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉందని సైతం ప్రకటించారు. ఇది సిపిఎం పోరుబాట ఫలితమేనని టిడిపి నేతలకు సైతం తెలుసు. ఇక ఎఎస్‌ఆర్‌ నగర్‌వాసుల వల్ల కాలుష్యం సమస్య 35 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే వచ్చిందా. ఒకవేళ వస్తే ఈలోపు అక్కడి ప్రజలను హెచ్చరించి, దిగువ ప్రాంత ప్రజలకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టొచ్చు. అక్కడ నివశిస్తున్న అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపి ఇళ్లు కట్టి ఇచ్చి వెళ్లమంటే అన్ని విధాలా న్యాయబద్దంగా ఉండేదనేది అందరి భావన. ఎందుకంటే ఇప్పటికే కోట్లాది రూపాయలు దాతల నుంచి సేకరించి ప్రభుత్వ శాఖలకు వసతులు సమకూర్చుతున్న ఎంఎల్‌ఎ రఘురామకృష్ణరాజుకు వంద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం పెద్ద పనే కాదు. మూడు నెలల్లో పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించి ఇవ్వగల సామర్థ్యం ఆయనకు ఉంది. దానికి భిన్నంగా సమస్యపై స్పందించకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత వైసిపి ప్రభుత్వంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఆ పార్టీ నేతల వ్యక్తిగత దూషణలను తప్పుబట్టి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా పేరొందారు. అప్పుడు ఎంపీగా ఏదైతే తప్పని స్వపక్ష నేతలకు చెప్పే ప్రయత్నం చేశారో, అదే రఘురామకృష్ణరాజు ఇప్పుడు పేదల పెన్నిధి, ఉద్యమాల రథసారధి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ దూషణలకు దిగడం ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని ఈ సంస్కృతి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకే నష్టం చేకూర్చుతుందనేది బహిరంగ రహస్యమనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. చివరిగా పేదల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అనేది సిపిఐ(ఎం) చెప్పే మాట. అలా చేపట్టే అభివృద్ధి పనుల్లో ఒక పేదవానికీ అన్యాయం జరగకూడదనేది, ఆ ఒక్క పేద కుటుంబానికీ న్యాయం చేయడమే నిజమైన అభివృద్ధి అనేది అందరి మాట. మరి ప్రస్తుత పాలకులు చెబుతున్న అభివృద్ధి ఏమిటో రానున్న రోజుల్లో ప్రజలే తేలుస్తారు.  -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️