ప్రజాశక్తి – బుట్టాయిగూడెం
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ తల్లి అందుగుల ముక్కమ్మ ఆదివారం రాత్రి అంబేద్కర్ కాలనీలోని తమ ఇంటి వద్ద కీర్తిశేషులైయ్యారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఫ్రాన్సిస్ తల్లి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు తామా ముత్యాలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.శ్యామల రాణి హాజరై సంతాపాన్ని ప్రకటించారు.
150 మందికి కంటి పరీక్షలు
కొయ్యలగూడెం : మండలంలోని పొంగుటూరులో ఏమెన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు శంకర నేత్రాలయం సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు కంటి సమస్యలు, జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. ఏమెన్ ట్రస్ట్ చైర్మన్ ఇవాంజెలిన్ మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శంకర నేత్రాలయ వైద్యులు డాక్టర్ రుతుజా, గుర్తించబడిన రోగులకు ఏలూరులో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గాంగవరం ఎఎల్సి చర్చి పాస్టర్, చక్రవర్తి టి.రమేష్, పిఎస్.జెరియాపాల్, కెఎస్.అశోక్, డివి.చౌదరి, తారా, దివ్యజ్యోతి సహకరించారు. వారి సహాయంతో ఈ శిబిరం విజయవంతమైంది.
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
ముసునూరు : మండలకేంద్రమైన ముసునూరు గ్రామానికి చెందిన మానికల శ్రీనివాసరావు మాజీ సొసైటీ అధ్యక్షులు గత మాసం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం ముసునూరు గ్రామానికి చెందిన మానికల గంగాధరరావు(సాఫ్ట్వేర్ ఇంజనీర్) తన సన్నిహితులతో కలిపి రూ.70 వేల నగదును శ్రీనివాసరావు(మాజీ సొసైటీ అధ్యక్షులు) కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కింద అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని అభినందించారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంకు జిల్లాస్థాయి కమిటీ
ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు : స్పెషల్ కోర్టు ఏలూరు వారి ఉత్తర్వులు, ప్రభుత్వ జిఒ నెం.519, 9.4.2025 మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్, డిపిఆర్ఒ, జిల్లా ఐటి అధికారి(డిఐఒ ఎన్ఐసి), సిఐడి అదనపు ఎస్పి, నగరపాలక సంస్థ ఎఒ, ఏలూరు స్పెషల్ కోర్ట్ అగ్రిగోల్డ్ సంస్థ సూచించిన పేర్ల సీతారామస్వామిని ఆథరైజ్డ్ మెంబరుగా జిల్లాస్థాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి అదనపు ఎస్పి కమిటీ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఏలూరు అర్బన్, ద్వారకాతిరుమల మండల తహశీల్దార్లు, జిల్లాస్థాయి కమిటీకి, పోలీస్, సిఐడి దర్యాప్తు ఏజెన్సీల విచారణ సమయంలో వారికి సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో పరిశీలించడం, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల నుంచి భూముల విలువ సేకరించడం, అధీకృత సంస్థల నుండి సరసమైన మార్కెట్ ధర సేకరించడం, అగ్రిగోల్డ్ భూములు రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయడం, జిల్లాస్థాయి కమిటీ విధులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీసులు, ప్రజల మధ్య సంబంధాల మెరుగుకు ‘పల్లెనిద్ర’
నూజివీడు రూరల్ సిఐ కె.రామకృష్ణ ముసునూరు : పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ అధికారులకు, ప్రజలకు మధ్య మానవీయ విలువలు మెరుగుపరచడానికి, పోలీసులంటే అంతర్గత భయం పోవడానికి కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యమని నూజివీడు రూరల్ సిఐ కె.రామకృష్ణ అన్నారు. మండలంలోని కాట్రేనీపాడు గ్రామంలో జిల్లా ఎస్పి కె.ప్రతాప్ శివకిషోర్, నూజివీడు డిఎస్పి కెవివిఎన్వి.ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ సిఐ కె.రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ ఎం.చిరంజీవి, ఇతర శాఖల అధికారులతో కలిసి పల్లెటూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి భద్రత, సమస్యలు, నేర నివారణ విషయాలపై చర్చించారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, బ్యాంకు పేరుతో వస్తున్న ఫేక్ మెసేజ్లు, ఆధార్ అప్డేట్ మోసాలు, ఫేక్ లింక్లు క్లిక్ చేయడం వల్ల డేటా చోరీలు జరుగుతాయని, లాటరీ గెలిచినట్లు మెసేజ్లు ద్వారా ఒటిపి అడిగి అకౌంట్లో డబ్బు మాయం చేసే మోసాల గురించి తెలియపర్చడంతో పాటు, ఇలాంటి సందర్భాల్లో సైబర్ హెల్ప్లైన్ 1930 లేదా టోల్ ఫ్రీ నెంబర్కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు ఆపద సమయంలో డయల్ 112కు ఫోన్ చేస్తే 15-20 నిమిషాల్లో సహాయం అందించబడుతుందని, గ్రామాలలో చిన్న, చిన్న సమస్యలు తలెత్తిన సమయాలలో పోలీసు వారికి తెలియజేస్తే సదరు సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. అది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిష్కార మార్గాలను పోలీసు వారు తీసుకుంటారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సీసీ టివిలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేర దర్యాప్తు సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్ధల సుహాసిని మోహనరావు, ఎన్ఎస్పి డిసి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, మాజీ సర్పంచి బొమ్మకంటి శ్యామలరావు, మాజీ సర్పంచి బడిపాటి సాంబయ్య, టిడిపి నాయకులు పిన్నిబోయిన మంగయ్య, గూడపాటి అజరు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటిలో ఎన్పిఇఎల్ పరీక్ష
నూజివీడు టౌన్ : నూజివీడు ట్రిపుల్ ఐటి క్యాంపస్లో సోమవారం నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హౌన్సుడ్ లెర్నింగ్(ఎన్పిటిఇఎల్) పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఆర్జియుకెటి రిజిస్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ 10,300 మందికి పైగా విద్యార్థులు 4 ట్రిపుల్ ఐటీల క్యాంపస్లలో పాల్గొన్నట్లు చెప్పారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగినట్లు వివరించారు. ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు. ఐఐటిలు, ఐఐఎస్సి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్ధేశ్యంగా వివరించారు. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఎన్పిటిఇఎల్ కోఆర్డినేటర్లు, ఫ్యాకల్టీ, సాంకేతిక బృందాలు, పరిపాలన సిబ్బంది సమిష్టిగా కృషిచేసినట్లు చెప్పారు. విద్యార్థులు అత్యుత్తమ సమన్వయంతో పరీక్షలకు హాజరై ప్రామాణికతను నిరూపించినట్లు తెలిపారు. ఆర్జియుకెటి విద్యా ప్రమాణాల పెంపు దిశగా, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని సోదాహరణంగా వివరించారు.
విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్, జిపిఎఫ్ వర్తింపజేయాలని వినతి
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్, జిపిఎఫ్ వర్తింపచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు విద్యుత్ ఉద్యోగుల జిపిఎఫ్ సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో వారు ఎంపీను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం తమకు పెన్షన్తో సహా ఇతర సౌకర్యాలు వర్తించకపోవడంతో ముదిమి వయసులో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యను చట్టసభల్లో ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎంపీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు పాల్గొన్నారు.