ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్
రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవాలంటే వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని రవాణా తనిఖీ అధికారి భీమారావు, ట్రాఫిక్ సిఐ లక్ష్మణ్ సూచించారు. ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్, గాంధీ మైదానం, వట్లూరు ప్రాంతాలలో రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఒకటో పట్టణ పోలీసు అధికారులు సంయుక్తంగా హెల్మెట్పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారికి హెల్మెట్లను ఉచితంగా అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమారావు, జి.ప్రసాదరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.స్వామి, ఎన్.నెహ్రూ పాల్గొన్నారు.