రహదారుల రూపురేఖలు మారారు : ఎంపీ

ప్రజాశక్తి – ఏలూరు సిటీ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల రూపురేఖలు మారాయని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లాస్థాయి అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన రహదారులకు అవసరమైన నిధుల మంజూరు నిమిత్తం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనల నివేదిక సమర్పించాలని ఎంపీ అధికారులకు సూచించారు. రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో సమర్థవంతంగా ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు పనిచేశారని ఎంపీ అభినందించారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు అధికారులు సహకరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సీడాప్‌ అధికారులకు సూచించారు. అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే తనతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎంపీ తెలిపారు. జిల్లాలోని కొన్ని శాఖల అధికారులు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొయ్యలగూడెం తహశీల్దార్‌ సక్రమంగా పనిచేయడం లేదని, పని నిమిత్తం వెళ్తే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని పలు రైతులు ఎంపీకు ఫిర్యాదు చేశారు. సదరు తహశీల్దార్‌ సక్రమంగా పనిచేయకపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశానికి ఆర్‌ అండ్‌ బి డిప్యూటీ ఇఇలు ఎం.గోవింద మోహన్‌, సిహెచ్‌.విజరు శేఖర్‌, ఇఇ వైవి.కిషోర్‌బాబు, ఎస్‌ఇ పి.భరతరత్నం, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఎంవి.రమణమూర్తి, నీటి యజమాన్య సంస్థ జిల్లా పీడీ కె.వెంకట సుబ్బారావు, భూగర్భ జలశాఖ ఇన్‌ఛార్జి డిడి సిహెచ్‌.వెంకటరావు, సీడాప్‌ జెడిఎం కె.పార్థసారథి, ఎపిఎస్‌ఎస్‌డిసి డిఎస్‌డిఒ ఎన్‌.జితేంద్ర పాల్గొన్నారు.

➡️