ప్రజాశక్తి – బుట్టాయగూడెం
అర్హులైన ప్రతి గిరిజనుడికీ సొంతిల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పులిరాముడుగూడెంలో పిఎం జన్మజాతి ఆదివాసీ న్యాయ మహా అధ్యయన్ (జన్మహా) కేంద్ర పథకం కింద ఇంటి నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు. లబ్ధిదారు బి.మాధవిని కలిసి ఇంటి నిర్మాణ పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పిఎం (జన్మహా) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేదలైన గిరిజనులకు 340 గజాల్లో రూ.3.39 లక్షల వ్యయంతో ఇళ్లను నిర్మిస్తుందన్నారు. బుట్టాయగూడెం మండలానికి 410 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఎంఎల్ఎలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, మాజీ ఎంఎల్ఎ ఘంటా మురళీ రామకృష్ణ, స్థానిక నాయకులు కొటికలపూడి గోవిందరావు, జి.సువర్ణరాజు పాల్గొన్నారు.
