కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక విధానం

రబీ నుంచి వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ
మంత్రి కొలుసు పార్థసారధి
ప్రజాశక్తి – ఏలూరు
రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని రబీ నుంచి తీసుకొస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం బ్యాంకర్ల జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ వ్యవసాయరంగంలో 80 శాతానికిపైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని, అయినప్పటికీ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు రూ.16 వేల కోట్ల రుణాలు లక్ష్యంగాను, కౌలు రైతులకు అందులో కేవలం ఒక శాతం రూ.240 కోట్లు లక్ష్యానికిగాను రూ.101 కోట్లు మాత్రమే పంట రుణాలుగా అందించడం నిజంగా బాధాకరమైన విషయమన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో భూయజమాని అంగీకారం ఉండాలని పెట్టిన నిబంధనతో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. 2024-19 తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో 18 లక్షల మందికిపైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తే, గత ప్రభుత్వం కేవలం 8 లక్షలమంది కౌలు రైతులకే గుర్తింపుకార్డులు జారీ చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్ది, భూ యజమాని అంగీకారంతో పని లేకుండా, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సాగుచేసే కౌలు రైతులను గుర్తించి భూయాజమాన్య హక్కులకు ఎటువంటి భంగం కలగని రీతిలో గుర్తింపు కార్డులు జారీ చేస్తారని, సదరు కార్డును పరిగణనలోకి తీసుకుని బ్యాంకర్లు రుణాలు అందిస్తారని తెలిపారు. వచ్చే రబీ సీజన్‌ నాటికి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి, అర్హులైన ప్రతి కౌలు రైతుకీ పంట రుణాలు అందించేలా సిఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. జిల్లాలో ప్రాధాన్యతారంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు చక్కని సహకారంతో రుణాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరిస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,600 కోట్లు లక్ష్యానికిగాను మొదటి త్రై మాసికంలో రూ.3223 కోట్లు రుణాలుగా అందించారన్నారు. జిల్లాలో పొగాకు రైతులకు రుణాలను బ్యారెన్‌కు రూ.8 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రయివేటు బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతతో చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు అందించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️