వర్జీనియా పొగాకు కిలోకు రూ.350 ఇవ్వాలి
ఎపి రైతుసంఘం
ప్రజాశక్తి – జీలుగుమిల్లి
వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని దర్భగూడెంలో ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి ధర కిలోకు రూ.330 వరకు వచ్చిందన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు పెరిగాయన్నారు. గత సంవత్సరం వలె మార్కెట్ ధరలు ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇప్పటికే వైట్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. వర్జీనియా పొగాకుకు తగిన ధర వచ్చేలా పొగాకు బోర్డు అధికారులు, ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో వివిధ పంటల రైతులకు కనీస ఖర్చులు కూడా రావడం లేదని, రైతులు నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్జీనియా పొగాకు ఎకరా సాగుకు కౌలుతో కలిపి రూ.3 లక్షలకుపైగా పెట్టుబడి అవుతోందన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, బోడిక రామచంద్రరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.
