ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన నిరసనలు
వాన్స్ దిష్టిబొమ్మ దహనం
ప్రజాశక్తి – ద్వారకాతిరుమల
ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద సోమవారం రైతులు నిరసన తెలిపారు. వాన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అమెరికా ఉత్పత్తులకు సంబంధించిన సుంకాలు, సుంకంయేతర అడ్డంకులను తగ్గించే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారన్నారు. పెంటల ధరల పతనానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, నేతలు గుర్రం రాంబాబు, బోయపాటి సత్యనారాయణ, తూంపాటి మురళీ, పోలుకొండ నాగరాజు, పాడి రైతులు నార్ని సత్యనారాయణ, ముత్యాల వెంకటరావు, మద్దిపాటి సత్యనారాయణ, దొండపాటి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. జీలుగుమిల్లి: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి. వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ వాన్స్ గోబ్యాక్ అంటూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రజాసంఘాల కార్యాలయ సమీపంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి సీతారామయ్య మాట్లాడగా నేతలు సుంకవల్లి శేషగిరిరావు, తాళ్లూరి సూర్యారావు, అనసూయ, పసుపులేటి రోశమ్మ తదితరులు పాల్గొన్నారు.
