ఉపాధి పనులు కల్పించాలి

May 8,2025 21:50

ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలసలో కూలీలకు ఉపాధి పనులు కల్పించకుండా మండల సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు భూతాల మోహన్‌రావు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఉపాధి, ఫారం ఫండ్‌ పనులు మాత్రమే చేయాలని బలవంతంగా చేయించేందుకు ఎంపిడిఒ, ఉపాధి హామీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్‌ నెల ముందు ఫారం ఫండ్‌ పనులు చేయించారని, అయినా కావాలనే కూలీలను ఇబ్బంది గురిచేయడానికి ఫారం ఫండ్‌ పనులు చేయండి, లేకపోతే మానేయండని ఎంపిడిఒ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పారని, ఇది సరికాదని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు ఉపాధి కూలీలకు ఎటువంటి ఆటంకం లేకుండా పని కల్పిస్తున్నామని ప్రకటనలు చేస్తుంటే దానికి అనుగుణంగా మండల ఉపాధి అధికారులు, ఎంపిడిఒ స్పందించడంలేదని విమర్శించారు. వెంటనే ఉపాధి కూలీలు కోరుకున్నచోట పనులు కల్పించాలని, లేకపోతే వచ్చే సోమవారం మొత్తం గ్రామంలోని వెయ్యి మంది కూలీలను కదిలించి పెద్ద ఎత్తున ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మండల కేంద్రంలో పని కల్పించడానికి డ్వామా పీడీ చొరవ చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️