ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 క్రీడా అంశాల్లో శిక్షణ శిబిరాలు జిల్లాలో 50చోట్ల నడుస్తున్నాయి. నెల రోజుల పాటు జరిగే క్రీడా శిక్షణా శిబిరాలకు విద్యార్థులు అధికసంఖ్యలో హాజరవుతున్నారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, ఫుట్బాల్, కరాటే, తైక్వాండో, బాక్సింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ శిబిరాలకు రోజు రోజుకు వచ్చే విద్యార్దులు సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో విద్యార్దులు హాజరవుతున్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు మెటీరియల్ కోసం రూ.7వేలు, శిక్షకుడికి రూ.2000 వేలు గౌరవ వేతనం కింద మంజూరు చేశారు. ఈ శిబిరాల ద్వారా విద్యార్ధుల్లో మానసిక, శారీరక ధారుడ్యం ఎంతగానో వృద్ధి చెందుతాయి. వీటితో పాటు నాణ్యమైన క్రీడాకారులు తయారు కావడానికి ఉపయోగ పడనున్నాయి. వేసవి శిక్షణ శిబిరాలకు మంచి స్పందన వస్తుందని,విద్యార్దులు ఎక్కువ సంఖ్యలో హాజరవు తున్నారు అని డిఎస్డిఒ వెంకటేశ్వరరావు తెలిపారు. మెరుగైన, నాణ్యమైన క్రీడాకారులు తయారు కావడానికి శిబిరాలు తోడ్పడతాయని తెలిపారు.
