ప్రజాశక్తి – కడప : ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం సామాజిక బాధ్యతగా భావించాలని 30 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్య నారాయణ మూర్తి అన్నారు. సోమవారం తెలుగు గంగా కాలనీలోని 30 ఆంధ్రా బెటాలియన్ లో నిర్వహిస్తున్న ఎన్.సి.సి కంబైండ్ అన్యువల్ శిక్షణ శిబిరంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాంప్ కమాండెంట్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి చేసి ఆరోగ్యంవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు అని అన్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి దానం చేసిన రక్తం ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటి రూపాలలో ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను నిలబెడుతుందని అన్నారు. అందువలన ప్రతి ఎన్.సి.సి క్యాడెట్ తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు, చుట్టుపక్కల ఉన్నవారికి రక్తదానం యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ గ్రూప్ కెప్టెన్ ఆర్.జే. ఆత్రే, ఎన్.సి.సి అధికారులు కెప్టెన్ డాక్టర్. నీలయ్య, శివరాం, పసుపుల రాజశేఖర్, జగదీష్, సురేంద్ర నాయక్ పరేడ్ శిక్షణ అధికారులు సుబేదార్ మేజర్ అనిల్ కుమార్, రూపేంద్ర జిత్ సింగ్, సీ.ఎల్. రెడ్డి, కొండా రెడ్డి , గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ మిశ్రా ఆఫీస్ సిబ్బంది సూపరిండెంట్ డేవిడ్, ఉమా, మల్లేశ్వరి, శివప్రసాద్, రాజగోపాల్ రెడ్డి, ఎన్.సి.సి సీనియర్ క్యాడెట్లు మల్లికార్జున్, ఆనంది పాల్గొన్నారు.
