ప్రజాశక్తి-ఆదోని రూరల్ (కర్నూలు) : మండలం పరిధిలో పాండవగల్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫారం ఫండ్స్ పనులును వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు బుధవారం పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ 33 మంది కూలీలు రెండు రోజులపాటు పని చేస్తున్నారుని, నేల గట్టిగా ఉండడం వల్ల కూలీలు బిందెలతో నీళ్లు మోసుకొని పనిచేస్తున్నారని అన్నారు. రెండు రోజులకు కలిపి కేవలం ఆరు మీటర్లు వెడల్పు తో 1 మీటర్ లోతు పని జరిగిందిని, ఈ పని ఎండాకాలంలో చేయడం అసాధ్యమని అర్థమవుతుంది. అయినా ప్రభుత్వం కచ్చితంగా ప్రతి గ్రామంలో 20 ఫారం ఫండ్స్ తవ్వాలని టార్గెట్లు పెడుతున్నారుని అన్నారు. కూలీలు చేయడానికి పనులు లేని ఈ టైంలో ముమ్మరంగా పనులు కల్పించాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరైనది కాదని వారు విమర్శించారు.ఫారం ఫండ్స్ పనులు కాకుండా ఫీడర్ ఛానల్ మరియు చెరువుల్లో పూడకతీత ఇలాంటి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.గత పది వారాలుగా ఉపాధి హామీ వేతనాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూలీలకు ఇప్పటివరకు అందించలేదని తక్షణమే వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలని, పారంపండ్స్ పనులు కాకుండా వేరే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
