ప్రజాశక్తి-మేదరమెట్ల : రావినూతలలోని ఆర్ఎస్సిఎ స్టేడియంలో నిర్వహిస్తున్న 31వ సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు ఉత్సాహం సాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన మ్యాచ్లో మార్టూరు, చెన్నై జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్ నెక్స్ట్ గాన్ సిఎ హైదరాబాద్ ,మస్తాన్ 11 మార్టూరు జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలు బ్యాటింగ్ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 133 పరుగులు చేసింది .అనంతరం బ్యాటింగ్కు దిగిన మస్తాన్ 11 మార్టూరు జట్టు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 13.1 ఓవర్లలో 137 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. మధ్యాహ్నం నిర్వహించిన రెండో మ్యాచ్లో ఎంఆర్సిసి చెన్నై వర్సెస్ ఎస్సి రైల్వే హైదరాబాద్ జట్ల తలపడ్డాయి. టాస్ గెలిచి ఎస్సి రైల్వే హైదరాబాద్ జట్టు తొలుత బౌలింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఎంఆర్సిసి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఎస్సి రైల్వే హైదరాబాద్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ మ్యాచ్లను రావునూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు ,అసోసియేషన్ సభ్యులు రామినేని శ్రీనివాసరావు ,నరసింహారావు హరిబాబు, తదితరులు పర్యవేక్షించారు. నేటి మ్యాచులు ఇవే…శుక్రవారం ఉదయం జీడీసీఏ గుంటూరు వర్సెస్ మస్తాన్ 11 మార్టూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం ఉదయం ఆడిన మ్యాచ్లో విజేత వర్సెస్ ఎంఐఎస్ రాఖీస్ చెన్నై జట్ల మధ్య జరగనుంది.