గిట్టుబాటు ధరలేక రోడ్లపై పారబోస్తున్న రైతులు
ప్రజాశక్తి – మదనపల్లె అర్బన్ : ఆరుగాలం కష్టపడి, లక్షలు ఖర్చు చేసి పండించిన టమోటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. కిలో టమోట రూ.5 పలుకుతుండటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పండించిన టమోటాలను రోడ్లు పక్కన పారబోస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లె లో ఉంది. రైతులు మదనపల్లె మార్కెట్ తెచ్చిన టమోటాలు భారతదేశం లోనే కాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే గత వారం నుంచి మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. గురువారం కిలో టమాటా కనిష్ఠంగా రూ.5 పలుకగా గరిష్ఠంగా రూ.9కి విక్రయించారు. వారం క్రితం రూ.12 వరకు ఉన్న ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.
మదనపల్లె, తంబళ్లపల్లె తో పాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో రైతులు పండించిన టమోటాలను మార్కెట్కు తీసుకురావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 కిలోల మొదటి రకం టమాటా రూ. 90 పలకడంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో పొలాల పక్కనే రోడ్లపై టమోటాలను పారబోస్తున్నారు. ఇంకొంతమంది రైతులు కూలీలు చెల్లించలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు. గతంలో పాలకులు మదనపల్లె లో టమోటాలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, టమోట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చినా ఇంతవరకు అమల్లోకి రాకపోవడంతో టమోట రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి టమోటాలకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.