రైతును తీసుకెళ్తున్న పోలీసు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తన భూమిని అన్యాయంగా ఆక్రమించారని, 8 నెలలుగా ప్రభుత్వ కార్యలయాల చుట్టూ తిరిగినా అధికారులు న్యాయం చేయలేదనే అవేదనతో రైతు మంగళవారం పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి ఆగ్గిపెట్టెను లాకోకవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీనిపై బాధిత రైతు వివరాల ప్రకారం.. రాజుపాలెం మండలం కొటనెములిపురికి చెందిన దేశిరెడ్డి రమణారెడ్డి భార్యకు కొనంకిలోని 279-15 సర్వే నంబర్లో ఎకరం పొలాన్ని పుట్టింటివారు 36 ఏళ్ల కిందట పసుపు కుంకుమ కింద ఇచ్చారు. 2024 మార్చి 26న భార్య సోదరుడు దొడ్డ పెద్దిరెడ్డి ఆ పొలంలో 38 సెంట్లను అక్రమంగా అన్లైన్ చేయించుకున్నాడు. గత ఖరీఫ్ సీజన్లో వరి సాగుచేయగా పంటను పెద్దిరెడ్డి కోసుకున్నాడు. దీనిపై రమణారెడ్డి స్థానిక పోలీసలను ఆశ్రయించగా పెద్దిరెడ్డి నుండి నష్టపరిహారం ఇప్పించారు. ప్రస్తుతం సాగు చేసుకోనివ్వకుండా పెద్దిరెడ్డి అండ్డుకోవడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందనలో విన్నవిం చినా ఫలితం లేకపోవడంతో విసుగుచెందిన రమణారెడ్డి మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. దీనిపై పోలీసులకు తహశీల్దార్ జె.మధుబాబు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రైతు సమస్యపై విరణ కోరేందుకు తహశీల్దార్ను ఫోన్ ద్వారా సంప్రదించినా, కార్యాలయం వద్దకు వెళ్లినా స్పందించలేదు.
