ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్ : ఆదివారం సంభవించిన ఈదురు గాలులకు గిద్దలూరు మండలం, ఎల్లుపల్లి గ్రామ పరిసరాల్లో బొప్పా యి పంటలు నేలమట్టం అయ్యాయి. విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సోమవారం వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను వెంటబెట్టుకుని గ్రామంలో దెబ్బతిన్న బొప్పాయి తోటలను పరిశీలించారు. ఎల్లుపల్లి గ్రామానికి చెందిన కొర్ర రామయ్య బొప్పాయి తోట పూర్తిగా నేలమట్టమైంది. దాదాపు రూ.2 లక్షల వరకు తనకు నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని రైతు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. రైతు కష్టాలు తనకు తెలుసని, అధైర్య పడవద్దని రైతుకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి త్వరితగతిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ బాలాజీ నాయక్, ఏవో విజయభాస్కర్రెడ్డి, ఉద్యానశాఖ అధికారిని విష్ణుప్రియ, తహశీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎంపీడీఓ రమణారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ దుత్తా బాలఈశ్వరయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
