షార్ట్‌ సర్క్యూట్‌తో అపార్ట్‌మెంట్‌లో మంటలు

  • ఐదుగురిని రక్షించిన ఫైర్‌ సిబ్బంది

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ : విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏలూరులోని శాంతినగర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా డిఎఫ్‌ఒ సిహెచ్‌.రత్నబాబు తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని శాంతినగర్‌ ఏడో రోడ్డులో ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల పక్కనే హిమని అపార్ట్‌మెంట్‌ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌ ఫోర్‌-బి ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో టివి ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు హాలు, బెడ్‌ రూమ్‌, కిచెన్లలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఫోర్‌-బి ఫ్లాట్‌ పైన ఉన్న ఫ్లాట్‌లో ఐదుగురు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. సుమారు రూ.15 లక్షల వరకు ఆస్తినష్టం ఉంటుందని, ఫ్లాట్‌ విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఫ్లాట్‌ యజమాని శ్రీకాంత్‌ తెలిపారు. ఆస్తి నష్టం సుమారు రూ.పది నుంచి రూ.13 లక్షల వరకు ఉంటుందని డిఎఫ్‌ఒ రత్నబాబు చెప్పారు.

➡️