- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి వెనుక ఉన్న నేతలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
- గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థులతో అమ్మకాలు
- మద్యం ఏరులై పారుతోంది : మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవి రెడ్డి ఆదిత్య
ప్రజాశక్తి – కడప : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, వారి వెనుక ఉండి నడిపిస్తున్న నేతలపై పోలీసులు కఠినంగా వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవి రెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నిటిని వంగలో తొక్కిందని ఘాటుగా విమర్శించారు. పది నెలల కాలంలో సాధించింది ఏమైనా ఉందంటే అది మద్యం ఏరులై పారేలా చేసిందన్నారు. సంతల్లో కూడా బెల్ట్ షాప్ లను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేస్తోందన్నారు. టన్నుల కొద్ది గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థులతో అమ్మకాలు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డు అదుపు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఆ పార్టీ నేతల కనుసన్నుల్లో జూదం సాగిస్తున్నారు అన్నారు. కడప నగరం 24వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి జూదం నిర్వహిస్తూ రాయచోటిలో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి అన్నారు. జూదం ఆడిస్తూ పట్టుబడ్డ అశోక్ రెడ్డి వైసీపీ నేతగా చెప్పడం బాధాకరమైన విషయం అన్నారు.అశోక్ రెడ్డి 24డివిజన్ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో కలిసి అశోక్ రెడ్డి ఫోటో కూడా దిగారని ఈ సందర్భంగా అంజాద్ బాషా, దేవి రెడ్డి ఆదిత్య మీడియాకు చూపించారు.లక్ష రూపాయలు కట్టి టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వ్యక్తి అశోక్ రెడ్డి అన్నారు.అలాంటి వ్యక్తిని వైసీపీకి సంబంధం అంటగట్టడం సరికాదు అన్నారు.అసాంఘిక శక్తులను అణిచివేసే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని కోరామని తెలిపారు.పోలీసులు పట్టుకొని వదిలేసిన అశోక్ రెడ్డి వెనుక ఉన్న శక్తి ఎవరు అని ప్రశ్నించారు. పోలీసులకు పట్టుబడ్డాక 41 నోటీసులు ఇచ్చి అశోక్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి అన్నారు. అసాంఘిక శక్తుల వెనుకున్న శక్తి ఎవరో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. అలాంటి వారిని మా అధినేత జగన్ ఉపేక్షించలేదు అన్నారు. సమీప బంధువు కొండారెడ్డి ని సైతం అరెస్ట్ చేయించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, వెనుక ఉన్న నేతలపై పోలీసులు కఠినంగా వ్యవహారించాలి అని తాము కోరుతున్నామన్నారు. భూ ఆక్రమణలకు, భూ దందాలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అని బురద చల్లడం కాదు, వచ్చిన ఆరోపణలను నిరూపించాలన్నారు. అరాచక శక్తి అశోక్ రెడ్డి వెనుకున్న ఆ నేత ఎవరో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నది టీడీపీనే అన్నారు. యువతను సైతం అశోక్ రెడ్డి పావులా వాడుకుంటున్నారు అన్నారు. సమాజానికి చెడు చేసే అశోక్ రెడ్డి లాంటి వ్యక్తులపై ఉక్కు పాదం మోపాలి అని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా కృష్ణ,సెక్రెటరీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.