సమావేశంలో టిడిపి, వైసిపి సభ్యులు పరస్పర స్పందనలు.. ఇన్సెట్లో మేయర్ రవీంద్ర
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నిర్వహించిన గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రశ్నలు అడిగిన ప్రతి సభ్యునికి రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని అధికారులను మేయర్ ఆదేశించారు. సభ్యులు మాట్లాడే అన్ని అంశాలను నమోదు చేయాలన్నారు. నగరంలో జరిగే ప్రతి అధికారిక అభివృద్ధి పని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక కార్పొరేటర్తో పాటు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఉండాలన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, స్థానిక సమస్యలను కార్పొరేటర్లు గ్రూప్లో పోస్ట్ చేయవచ్చని, అధికారులు సంబంధిత సమస్యల పరిష్కార చర్యలను కూడా గ్రూప్లోనే తెలియజేయాలని అన్నారు. అంతకు ముందు వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో సమస్యల పరిష్కారంపై అధికారులకు అప్పటికప్పుడు తగిన ఆదేశాలిచ్చి వెంటనే పరిష్కారం చూపలన్నారు. విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. గోరంట్ల నీటి పథకం అసంపూర్తిగా ఉండటం, వేసవిలో నీటి సరఫరాకు జరుగుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. నీటి వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయని, పేదలకు నీరు అందక బిందెలు పట్టుకుని రోడ్డుమీదకు వస్తుంటే ధనికులు కార్లు కడుక్కునేందుకు మున్సిపల్ నీటిని వాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ కార్లు కడుక్కుకోవడంతో పాటు అపార్టుమెంట్లలో స్విమ్మింగ్ పూల్స్కు కూడా తాగునీటిని వాడుతున్నారని అన్నారు. ఇందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు. నీటి వినియోగంపై నియంత్రణ ఉండాలన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించే పద్ధతిని నియంత్రించాలంటే వెంటనే మీటర్లు ఏర్పాటు చేయాలనగా ఇందుకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతు పలికారు. వైసిపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటర్లు పెడితే పేదలు భరించలేరని అన్నారు. అపార్టుమెంట్లలో ఇప్పటికే మీటర్లు ఉన్నాయని, వారి వద్ద ఫీజులు తీసుకోకుండా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు రోషన్, అచ్చాల వెంకటరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే నశీర్ మాట్లాడుతూ టూటౌన్లో మీటర్లు పెడితే ప్రజలు భరిస్తారని వన్టౌన్లో అంతా పేదలని, అటు మీటర్లు వద్దని చెప్పారు. ఇప్పటికే వీధి కుళాయిలు తొలగించారని, బోర్లు లేకుండా చేశారని, బావులు లేవని, ప్రజలకు కేవలం మునిసిపల్ నీరు మినహా ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ఈ దశలో మీటర్లు పెడితే భరించలేరన్నారు. అనధికారిక నీటి కుళాయిలను తొలగించాలని లేదా ఫైన్ వేసి రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. గుంటూరులో 80 శాతం మంది పేదలున్నారని, మీటర్లను వీరు భరించలేరని చెప్పారు. పలుకుబడి ఉందని గుంటూరులోని జ్యోతిర్మయి అపార్టుమెంట్ వారికి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వాయర్ నుంచి 8 అంగుళాల పైపులైను ఏర్పాటు చేశారని, దీనివల్ల 8 డివిజన్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అచ్చాల వెంకటరెడ్డి ప్రస్తావించారు. ఈ నిర్ణయం మేయర్ కావటి మనోహర్ హయాంలోనే జరిగిందని టిడిపి సభ్యులు బదులిచ్చారు. అప్పుడు తాము వ్యతిరేకించామని, టిడిపి అధికారంలోకి రాగానే ఇచ్చారని వైసిపి కార్పొరేటర్లు ప్రతిస్పందించారు. టిడ్కో ఇళ్లకు నీటి సరఫరాపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. టిడ్కో ఇళ్ల అప్పగింతలో జాప్యమవుతోందని, కార్పొరేటర్ అయిశెట్టి కనకదుర్గ అన్నారు. పాత గుంటూరు 3వ డివిజన్లో 2.71 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారని కార్పొరేటర్ పోలవరపు జ్యోతి తెలిపారు. దీనిని తాము స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మేయర్ చెప్పారు. నగరంలో పారిశుధ్య వ్యవస్థ సరిగా లేదని పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కాల్వల్లో ప్లాస్టిక్ బాటిల్స్ కుప్పలుగా వస్తున్నాయని మేయర్తో పాటు పలువురు సభ్యులు మండిపడ్డారు. పారిశుధ్య సిబ్బందికి రూ.కోట్లు ఖర్చుచేస్తున్నా వారు పనిచేయడం లేదని, పర్యవేక్షణ లోపించిందని అన్నారు. ఎమ్మెల్యే నశీర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులు ఎవ్వరూ క్షేత్రస్థాయికి వెళ్లడం లేదన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఎక్కడికి వెళ్లినా తమను నిలదీస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. గ్రీన్గ్రేస్ అపార్టుమెంట్లకు అనుమతిలేకున్నా 200 ప్లాట్లు నిర్మించారని కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్ అన్నారు. ఈ విషయంలో చాలా తప్పులు జరిగాయని కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. నిర్మాణాలు ఆపాలని తాము నోటీసులిస్తే నిర్మాణదారుడు కోర్టుకు వెళ్లారన్నారు. తుది తీర్పునకు లోబడి నిర్మాణాలు కొనసాగించాలని, నిర్మాణాల్లో అక్రమాలున్నట్టు తేలితే మొత్తం కూల్చివేస్తామని, కొనుగోలు దారులకు మొత్తం నష్టపరిహారం నిర్మాణదారుడే చెల్లించాలని కోర్టు షరతులతో కూడిన స్టే ఇచ్చిందని వివరించారు. అక్రమ నిర్మాణం అని తెలిసినా కోనుగోలుదార్లను నిర్మాణదారుడు మభ్య పెడుతున్నారని, ఈ విషయంలో కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్బాబు కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో హ్యాపినెస్టు పేరుతో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మొత్తం 30 ప్రశ్నలపై చర్చ జరిగింది. మరోవైపు అభివృద్ధి పనులకు సంబంధించి 134 ప్రతిపాదనలు, 257 ప్రియాంబుల్స్కు సమావేశం ఆమోదం తెలిపింది.
