రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం : గారపాటి శ్రీనివాస్‌

ప్రజాశక్తి -ఆలమూరు (కోనసీమ) : రైతాంగానికి శివారు వరకు సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు, ఉత్తమ సేవా అవార్డు గ్రహీత, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ స్టేట్‌ వైస్‌ చైర్మన్‌ గారపాటి శ్రీనివాస్‌ చౌదరి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివారు ప్రాంతం, పెనికేరు, కలవచర్ల గ్రామాలకు చెందిన కోడు కాలువ పూడికతీత పనులను జెసిబి సాయంతో శనివారం ప్రారంభించారు. రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అహర్నిశలు కఅషి చేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అన్నారు. గత ప్రభుత్వం రైతులకు సేవలు అందించకుండా చేసిన నిర్లక్ష్యం అధిగమించేందుకే కోడు కాలువ పూడికతీత పనులు ప్రారంభించామన్నారు. ఈ కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో వేసవికాల సమయంలో కిందనున్న పంట పొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. అలాగే వర్షాకాల సమయంలో చొప్పెల్ల, జన్నాడ, పెనికేరు, కలవచర్ల, ఆలమూరు గ్రామాల నుండి వచ్చే వర్షపునీరు పోటెత్తడంతో సుమారు 300 ఎకరాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న ఈ కోడు కాలువను పలువురు ఆక్రమించుకోవడంతో చేనుగట్లు సరైన రీతిలో లేకపోవడంతో నీరు ప్రవహించడం లేదన్నారు. అదేవిధంగా కోడు కాలువ పరిసర ప్రాంతాల్లో పలు గ్రామాలకు చెందిన చెత్తను తీసుకువచ్చి డంపు చేయడంతో నీరు నిలిచిపోతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వేగంగా స్పందించి కోడు కాలువ సమస్యలను, ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. నీటి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గారపాటి శ్రీనివాస్‌ రైతు సమస్యలపై స్పందిస్తూ చేస్తున్న సేవలకు రైతాంగం కఅతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

➡️