ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్
కొండకిండాం, కొట్టక్కిలో ఎంఎస్ఎంఇ పార్కులకు శంకుస్థాపన
ప్రజాశక్తి-బొండపల్లి, రామభద్రపురం : ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఇ పార్కుకు, రామభద్రపురం మండల పరిధిలోని కొట్టక్కి గ్రామం వద్ద రూ.7కోట్లతో మంజూరైన ఎంఎస్ఎంకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన అధ్యక్షతన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇదొక సువర్ణావకాశమని పేర్కొన్నారు. పరిశ్రమకు అవసరమైన స్థలాన్ని అందించడంతోపాటు సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఇతర రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయని, వలసలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ పార్కుల్లో 24 గంటల విద్యుత్, రోడ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యంతోపాటు ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ పార్కుల్లో ఉత్పత్తులు బయటకు తీసుకువెళ్లి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ మాట్లాడుతూ, అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటు రాష్ట్రాభివృద్దిలో కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ పార్కులో తొలిదశలో అభివద్ది చేయనున్న 25 ఎకరాల్లో సుమారు 180 ప్లాట్లు రూపొందిస్తామని, వీటి ద్వారా దాదాపు 90 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటివల్ల ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రామభద్రపురంలో కూరగాయల మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందిందని, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మెరుగైన ధరలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ఈ పార్కులన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంల రాష్ట్ర ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శివశంకరప్రసాద్, డిసిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ ఎఎంసి ఛైర్మన్ పివివి గోపాలరాజు, కూటమి పార్టీల నాయకులు కొండపల్లి కొండలరావు, రెడ్డి పావని, ఎం.సురేష్, దుర్గాప్రసాద్, ఎం.పార్వతి మాట్లాడారు. ఎపిఐఐసి జెడ్ఎం మురళీమోహన్, ఆర్డిఓ డి.కీర్తి, తాహశీల్దార్ డి.రాజేశ్వర్రావు, ఎంపిడిఓ కె.తులసీనాధ్ తదితర అధికారులు, సర్పంచ్ ఆదిలక్ష్మి, శ్రీదేవి తదితర నాయకులు పాల్గొన్నారు. బొబ్బిలిలో కూటమి నాయకులు బాబు, గిరడ అప్పలస్వామి, మరిశర్ల రామారావు, మర్రాపు సురేష్, మడక తిరుపతిరావు, చింతల రామకృష్ణ, కర్రోతు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.