ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశంకు సంబంధించి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవతేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రెటరి బి.శ్రీనివాసరావు, డిఎస్పీ అజీజ్, లాలాపేట ఎస్ హెచ్ఓ శివ ప్రసాద్ లతో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ను ఏప్రిల్ 28వ ఉదయం 11 గంటలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నిక కు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు వివరిస్తూ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశమునకు కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10:30 గంటలకు తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, సభ్యులు మినహా ఇతరులు ఎవరినీ సమావేశంలోనికి అనుమతించబడరని తెలిపారు. మొబైల్ ఫోన్ లకు కూడా అనుమతి లేదన్నారు. ఎన్నికలు జరిగే జిఎంసి ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటున్నందున ర్యాలీలు, గుంపుగా రావడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా బారీ కేడింగ్, బందోబస్త్ చర్యలు జిఎంసి, పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. మేయర్ ఎన్నికకు సంబంధించి టిడిపి, వైఎస్ఆర్సీపి విప్ లు జారీ చేసి, అందుకు సంబంధించిన పత్రాలను ప్రిసైడింగ్ అధికారికి జిల్లా కలెక్టరేట్ లో అందించారు. అలాగే టిడిపి మేయర్ అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్రని ప్రతిపాదిస్తూ టిడిపి అధిష్టానం ఇచ్చిన ఫారం-బి ని కూడా పిసైడింగ్ అధికారికి అందించారు.
