ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : ఆరోగ్యవంతమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి సిఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణంలోని 30వ వార్డులో శనివారం స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర పారిశుధ్య పనుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తాగు, సాగునీరు అందించే పంట కాలువ పట్టణ వెంబడి చెత్త చెదారం, వ్యర్ధాల గుట్టలను పారపట్టి తొలగించారు. వ్యర్ధాలను పారిశుధ్య కార్మికులతో కలిసి ట్రాక్టర్లో తరలించారు. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రతి మూడో శనివారం పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పట్టణాల్లో ప్రజలపై చెత్త పన్ను భారం వేస్తే కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చిపోయాడన్నారు. ప్రజల నెత్తిన పోసిన చెత్తతోపాటు జగన్ అందించిన చెత్త పాలనను సైతం కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా కడుగుతుంది అన్నారు. చంద్రబాబు గత టిడిపి ప్రభుత్వంలో సంపద కేంద్రాలను నిర్మిస్తే జగన్ వాటిని విధ్వంసం చేశాడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలు స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
