ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు ఇంటింట సర్వే చేపట్టనున్నట్లు డిఎంహెచ్ఒ డాక్టర్ ఎస్. జీవన రాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రెండు రోజులు పాటు పిహెచ్సి వైద్యాధికారులకు జరిగిన శిక్షణలో ఆమె మాట్లాడారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింట సర్వే పటిష్టంగా చేయించాలని తెలిపారు. గుర్తించిన కేసులకు సత్వర వైద్యసేవలు అందించాలని తెలిపారు. కుష్టు వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి నివారణ అధికారి కె.రాణి, డిఎన్ఎంఒ డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
లైన్ డిపార్టుమెంటులన్నీ సహకరించాలి : కలెక్టర్
కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి లైన్ డిపార్టుమెంట్లన్నీ సహకరించాలనిక లెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో లెప్రసీ అవగాహన కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. శరీరం పై స్పర్శ లేని మచ్చలు, చర్మం పై రాగి రంగు మచ్చలు, లావుగా మారిన, నొప్పి తో కూడిన నరములు, కాళ్ళు లేద చేతులు కండరాలలో బలహీనత ఉన్న, చేతులు, పాదాలు నరములలో తిమ్మిర్లుగా అనిపించినా పరీక్షలు చేయిన్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమం పై డ్వాక్రా, మెప్మా , అంగన్వాడీల ద్వారా ప్రచారం జరగాలని తెలిపారు. అనంతరం అందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో డిఎంహెచ్ఒ జీవనరాణి, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ రాణి , విద్య, వైద్య శాఖ , ఐసిడిఎస్, మెప్మా , డిఆర్డిఎ శాఖల అధికారులు పాల్గొన్నారు.