మినీ గోకులం… బిల్లులకు ఎంత కాలం?

May 8,2025 21:11

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : అధికారు భరోసాతో వేలాది రూపాయలు ఖర్చు చేసి తమకున్న పాడి పశువులకు మినీ గోకులాల నిర్మించుకున్న పాడి రైతులకు బిల్లులందక ఇబ్బందులుపడుతున్నారు. పాడి పశువుల కోసం రైతులు తాటాకు కమ్మలతో గోసాలలను నిర్మించుకొని వాటిని ప్రతి మూడేళ్లకొకసారి మార్చుకుని వేయడంతో చాలా ఖర్చులు అవుతాయని వాటన్నింటిని అధిగమించి శాశ్వతమైన నిర్మాణాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ఉపాధి హామీ నిధుల ద్వారా ప్రభుత్వమే అందిస్తుందని ప్రభుత్వం చెప్పింది. దీంతో అప్పులు చేసి మరీ ఈ మినీ గోకులాలను రైతులు నిర్మించుకున్నారు. ఈ మినీ గోకులాలకు ప్రభుత్వం 90 శాతం రాయితీతో నగదు చెల్లిస్తుందని ఆశతో అప్పులు చేసి మరీ వీటిని నిర్మించుకున్నారు. ఈ పథకంలో రెండు ఆవులు ఉన్న రైతులకు రూ.లక్షా 15 వేలు, నాలుగు ఆవులున్న పాడి రైతులకు రూ.1లక్షా 85వేలు, ఆరు ఆవులున్న పాడి రైతులకు రూ.2 లక్షల 35 వేలుగా మూడు రకాలుగా వర్గీకరించి రైతులు తమకు అనుకూలమైన పథకాలను ఎంచుకొని ప్రభుత్వ నిర్ణయించిన తమ వాటా కింద పది శాతాన్ని అప్పులు చేసి సమకూర్చుకున్నారు. మిగతా 90 శాతం నిధులు ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో వాటిని కూడా అప్పులు చేసి మరీ నిర్మించుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌ వరకు ఈ నిధులను సక్రమంగానే చెల్లించారు. ఆ తర్వాత నుంచి బిల్లులు రాక ఇప్పుడు నిర్మించుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నిర్మించుకున్న పాడి రైతులంతా పేదలే కావడంతో వారి పాలిట ఈ పథకం శాపంగా మారింది. ప్రభుత్వము తమకు అప్పగించిన లక్ష్యాన్ని చేరువయ్యేందుకు పశుసంవర్ధక శాఖ వారు పాడి రైతులు ఉన్న గ్రామాల్లో ప్రతి రైతు వద్దకు వెళ్లి ఈ మినీ గోకులాలను నిర్మించుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చి మరి నిర్మించారు. తీరా ఇప్పుడు బిల్లులు గురించి రైతులు అడగ్గా తమకు సంబంధం లేదని, ఆ నిధులు ఉపాధి హామీ పథకం నుండి చెల్లిస్తారని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా ప్రయోజనం లేదని పాడి రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేసి బిల్లులను తొందరగా రైతులకు చెల్లించేలా కృషి చేయాలని కోరుతున్నారు. బిల్లులు చెల్లింపుల్లో అలసత్వంతో నరేగా నిధులతో పలు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం గమనార్హం. మండలంలో సుమారు 74 మినీ గోకులాల నిర్మాణం సాగిందని వీటి నిమిత్తం ఇప్పటి వరకు రూ.2కోట్లు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వీటి నిర్మాణం చేపట్టిన చాలా మంది పాడి రైతులు మొదటిలో చాలా ఆనందంతో తమ పశువులకు మంచి షెడ్లను వేసుకోవడానికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహం ఇస్తుందని, ఆశపడి వీటి నిర్మాణం నిమిత్తం స్థానిక నాయకులు, అధికారులు చుట్టూ తిరిగి వాటిని మంజూరు చేయించుకున్నారు. తీరా మంజూరు చేసుకున్నాక తొందరగా వాటి నిర్మాణం చేపట్టాలని క్షేత్ర సహాయకులు రైతులను తొందర పెట్టారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయితే బిల్లులు కూడా తొందరగా వస్తాయని చెప్పడంతో అప్పులు చేసి జనవరి నెలలో నిర్మాణాలను పూర్తి చేశారు. ఐదు నెలలు కావస్తున్నా నేటి వరకు బిల్లులు అందకపోవడంతో వాటికి వడ్డీలు పెరిగి నానా అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని, గత నాలుగు నెలల నుండి ఒక్క నయా పైసా కూడా వీటి చెల్లింపులు కొనసాగించక పోవడంతో వడ్డీలు పెరిగిపోవడంతో తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండలంలో 14 పాఠశాలల ప్రహరీ గోడలను నిర్మించారు. వాటికి కూడా బిల్లులు అందక గుత్తేదారులు ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కింద పనులు చేస్తే తొందరగా బిల్లులు అవుతాయని ఆశపడి చేసిన పాడి రైతులకు, చిన్న చిన్న గుత్తేదారులకు చివరకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి తొందరగా బిల్లు చెల్లించేలా కృషి చేయాలని కోరుతున్నారు.ప్రభుత్వం నుంచి నిధులు రాగానే చెల్లిస్తాంమండలంలో చాలా పంచాయతీల్లో మినీ గోకులాలను ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేశాం. వాటి బిల్లులు కూడా మా వద్ద అప్లోడ్‌ చేశాం. నగదును ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు వారి అకౌంట్లో పడతాయి, పాఠశాల ప్రహరీ గోడలు కూడా గుత్తే దారులకు చెల్లించాల్సిన 14 ప్రహరీ గోడలకు రూ.85 లక్షల వరకూ బిల్లులు అప్లోడ్‌ చేసి ఫైలును పంపించాం. ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా తొందర్లోనే చెల్లింపులు జరుగుతాయి.రామకృష్ణ నాయుడు,ఎపిఒ, సాలూరు.

➡️