ప్రజాశక్తి- గూడూరు : గూడూరులో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. స్థానిక గూడూరు గ్రామంలోని కత్రి వీధి రంగస్వామి కోటర్స్లో నివాసముంటున్న సిఐటియు డివిజన్ కార్యదర్శి మోహన్ మంగళవారం తన కుటుంబంతో అనంతపురంలోని యాడికి గ్రామానికి వెళ్లారు. ఎవరూ లేకపోవడంతో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం దోచుకెళ్లారు. తులం కమ్మలు, ఉంగరం, మాటీలు, ముక్కు రాళ్లతో కలిపి సుమారు నాలుగు తులాల బంగారం పోయిందని మోహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చుట్టుపక్కల వారు గమనించి ఫోన్ చేయడంతో బుధవారం రాత్రి వచ్చి చూశామని, బంగారం పోయినట్లు గుర్తించామని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల దొంగతనాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారని అన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
