ప్రజాశక్తి – అమలాపురం రూరల్ : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 8 వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఉద్యోగుల పట్ల మంత్రి అనుచితంగా మాట్లాడటం భావ్యం కాదని విచారణ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి అధికారులు, సంఘ నాయకులతో చర్చించి తమ సమస్యలు విని మానవత దృక్పథంతో పరిష్కార మార్గాన్ని ప్రకటించాలని వారు కోరారు. ఈ క్రమంలో వారు అడుగుతున్న వేతన సవరణ అంశం కానీ, పెండింగ్ బకాయిలు కాని గొంతెమ్మ కోరికలు కాదని, 6 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగక పోగా రెండు సంవత్సరాలుగా ఉన్న బకాయిలు కోసం, ఇన్సెంటివ్స్ విషయంలో కూడా ఉన్న అపోహలు తీసివేసి కేవలం సి హెచ్ ఓ చేసే పని ఆధారంగానే ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సమ్మె రూపంలో ప్రభుత్వానికి మా బాధను వ్యక్తపరుస్తున్నామని, ఇప్పటికైనా తమ ఆవేదన పట్టించుకొని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే కొన్ని సోషల్ మీడియా లో సి హెచ్ ఓ లు ఇతర కేడర్లను కించపరుస్తూ కామెంట్స్ పెట్టారు అని వచ్చిన అభియోగం అనేది పూర్తిగా ఎవరో కావాలని కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకొని కేడర్ల మధ్య చిచ్చు పెట్టే రీతిగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ఇది గమనించి తమ అసోసియేషన్ తరుపున ఆ అకౌంట్ మీద సైబర్ క్రైమ్ నందు కంప్లైంట్ చేశామన్నారు. జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తపరుస్తూ,ప్రజారోగ్య వ్యవస్త లో పనిచేస్తున్న అందరం ఒక కుటుంబం లాగా మెలుగుతూ ఎవరు కూడా ఏ ఒక్క కేడర్ నీ అవమానించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా గౌరవంగా అవగాహనతో పనిచేస్తూ వ్యవస్తను బలోపేతం చేయాలని కోరారు.
