ఆటో బోల్తా – కూలీలకు గాయాలు

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ (మన్యం) : దినసరి కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు కూలీలకు గాయాలైన ఘటన మంగళవారం మన్యం జిల్లా పార్వతీపురం రూరల్‌లో జరిగింది. మండలంలోని పెద్దమరికి గ్రామం నుంచి కారాడవలస వెళుతున్న ఆటో మార్గమధ్యంలోని కృష్ణపల్లి గ్రామ శివారు మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఎప్పటిలాగానే పెద్దమరికి దినసరి కూలీలు సిమెంట్‌ పని నిమిత్తం కారడవలసకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 సహాయంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి కుడి కాలికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. సంఘటనపై రూరల్‌ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️