ప్రజాశక్తి- కడప అర్బన్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మోకాళ్లపై నిల్చుని కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ నాయకులు కంచుపాటి శ్రీరాములు, ఇత్తడి ప్రకాష్ మాట్లాడుతూ పారిశుధ్య పనిని నమ్ముకుని ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది.. ఆ ప్రభుత్వ మేలు చేస్తుందని. అని ఇనాళ్లు కార్మికులు ఎదురు చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 20, 30 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. అందుకు ప్రతిఫలంగా చంద్ర బాబునాయుడు, కూటమి ప్రభుత్వం ఒట్టి చేతులతో గెంటివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు, మూడు సంవత్సరాల కిందట చేరిన 1,50,000 మందిని సచివాలయ సెక్రెటరీ వ్యవస్థలోని వారిని పర్మిట్ చేశారని తెలిపారు. 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస గుర్తింపు కార్డు కానీ, అనుభవ సర్టిఫికెట్ కానీ, రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ లాంటిది ఏది వర్తింప చేయక గత ప్రభుత్వంపై సాధింపుగా ఆప్కాస్ కార్మికులను తొలగిస్తున్నారని చెప్పారు. చేతనైతే మీరు మీరు తెల్చుకోవాలే తప్ప కార్మికులు కడుపు కొట్టే ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు లాగా వయో పరిమితి పెంచాలని కోరారు. లేని పక్షాన తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చుకునేందుకు ఆందోళన బాటలో ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. అవసరమైతే పూర్తిస్థాయి సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమని, ఆమరణ దీక్షకు వెళ్లి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చుకుంటామని తెలిపారు. ఇందుకు కార్మికులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుంకర రవి, కంచుపాటి తిరుపాలు, సుంకర కిరణ్, రొడ ఆదం, కొండయ్య, ప్రభాకర్, ఆర్.శీను, నాగరాజు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
