ప్రజాశక్తి-గిద్దలూరు : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో వినూత్న విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ చూపారు. పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి అంశాలపై స్థానిక పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించగా వినూత్న విద్యానికేతన్ హైస్కూల్ పాఠశాల విద్యార్థిని ఎం మేఘన 3వ బహుమతి సాధించింది. అనంతరం విజేతలకు యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశ్వర్లు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్టు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తేజ, అరుణ్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.