ప్రజాశక్తి-కడప అర్బన్ : జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సెంట్ జోసఫ్ జూనియర్ కాలేజ్ మరియాపురం కాన్ఫరెన్స్ హాల్ లో చీప్ సూపర్ డెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 48పరీక్షా కేంద్రాలలో మొత్తం 47 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించామని తెలిపారు. పరీక్షలు జరిగే రోజు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ వాచ్ లు, మొబైల్ ఫోన్స్ అనుమతించబడవని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్స్ తీసుకుని రాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా విద్యార్థులు అస్వస్థకు గురైతే ప్రాథమిక చికిత్స అందించేలా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఈసీ మెంబర్స్, కళాశాలల చీప్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఆర్.ఐ ఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
