ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 12వ తేదీ నుండి 20వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం కలెక్టర్ నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్తేజ, ఇంటర్ ఆర్ఐఒ జుబేర్ , డిఇఓ రేణుకతో కలసి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ జరకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సప్లమెంటరీ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ కోర్సులకు 23,279 మంది విద్యార్దులు , రెండవ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కోర్సులకు 3,883 మంది విద్యార్థులు హాజరవుతున్నందున ఆ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎఎన్ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చూడాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డిఆర్ఒ ఎన్ఎస్కె.ఖాజావలి, ఆర్డిఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.