ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జూడో పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల కెజిబివి కి చెందిన విద్యార్ధినులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తమ ఛాంబర్లో మంగళవారం అభినందించారు. ఈనెల 9న స్థానిక విజ్జీ స్టేడియంలో జూడో ఎంపికలు జరిగాయి. ఈ పోటీల్లో నెల్లిమర్ల కెజిబివి కి చెందిన 8 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలు 15,16 తేదీల్లో విజయవాడ ఐజిఎంసి స్టేడియంలో జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. వీరిలో జిల్లాకు చెందిన వై.అనూష 52 కిలోల విభాగంలో రెండోస్థానంలో, పి.జ్యోత్సారాణి తృతీయ స్థానంలో నిలిచారు. బి.భార్గవి 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచారు. 70 కిలోల విభాగంలో పి.సత్య కూడా ద్వితీయ స్థానంలో నిలిచారు. వై.అనూష జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యింది. వీరిని జెసి సేతుమాధవన్ అభినందించి, మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో డిఇఒ మాణిక్యం నాయుడు, సర్వశిక్ష ఎపిసి డాక్టర్ ఎ.రామారావు, జిసిడిఒ మాలతి, నెల్లిమర్ల కెజిబివి ప్రిన్సిపాల్ బి.ఉమ, పీడీ ఎస్.రమ తదితరులు ఉన్నారు
